హైదర్నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): మహిళల సంక్షేమం కోసం సావిత్రి బాయి ఫూలే చేసిన సేవలు మరువలేమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి తెరాస ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మగళ్ళ మోజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ పాల్గొని సావిత్రి బాయి ఫూలే 189వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప కవయిత్రి, రచయిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ అని కొనియాడారు. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. స్త్రీలకు విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకి అని, గొప్ప రచయిత్రి అని అన్నారు.

కులమతాలకతీతంగా విద్యనభ్యసించే హక్కు అందరికీ ఉంటుందని, అందుకే అందరూ చదువుకోవాలని, అందరూ సమానంగా బతకాలని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి అని అన్నారు. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, సంగి విజయ, నర్సింహ చారీ, సాయి, రాము పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి…
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక వేత్త సావిత్రి బాయి పూలే 189వ జయంతి ఉత్సవాలు ఆదివారం అంజయ్య నగర్ సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు మోడల రవిసాగర్, ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు కొండా బాలస్వామి సగర, గౌరవ సలహాదారులు మోడల నరసింహ సగర, దిండి లక్ష్మయ్య సగర, ఆంజనేయులు సగర, కోశాధికారి రాజు సగర, సీతారాం, యువజన అధ్యక్షుడు మోడల కుమార్ సగర, యువజన సంఘం సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే జీవితం నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం, అంటరాని తనం రూపుమాపేందుకు ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అక్షర జ్ఞానంతో సమాజం సన్మార్గంలో నడుస్తుందని భావించిన ఆమె తన నుంచే చదువు ప్రారంభించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

అనాథాశ్రమం విద్యార్థులకు ఆర్థిక సహాయం…
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆదివారం భేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మల్కాజిగిరి మదర్ ఇండియా అనాథాశ్రమం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రామచందర్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలే సామాజిక సంస్కర్త, విద్యావేత్త అని అన్నారు. బ్రిటిష్ హయాంలో మహిళలు ఇల్లు దాటి బయటకు రావడం పాపంగా భావించే రోజుల్లో వారి హక్కుల గురించి ఎవరూ పట్టించుకోని సమయంలో, ఆమె మహిళల విద్య కోసం సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఎంతో మంది మహిళలకు విద్యావకాశాలు కల్పించడం ద్వారా వారిని శక్తి వంతులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. భేరి అనురాధ యాదవ్, భేరి శ్రీనివాస్ యాదవ్, భేరి సంధ్య యాదవ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, భేరి సాయి కిరణ్ యాదవ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






