తెలంగాణ పోలీసులకు సెల్యూట్ : సినీ నటుడు రామ్ చరణ్

  • క్రీడాలతో నూతనోత్సాహం: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
  • క్రీడలతో ఫిట్‌‌నెస్: అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపురి రమేశ్
  • ముగిసిన సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2021

సైబ‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు రామ్ చరణ్, గౌరవ అతిథిగా అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపురి రమేశ్ లు హాజరయ్యారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను రామ్ చరణ్, నాగపురి రమేశ్ లు ప్రారంభించారు. పురుషుల విభాగంలో రమేశ్, మహిళల విభాగంలో రమాదేవి, పీసీ గెలుపొందారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న సినీ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ తేజ

అనంతరం బాలానగర్ జోన్ పోలీసులకు, సీఏఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులకు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో సీఏఆర్ హెడ్ క్వార్టర్ పోలీస్ టీమ్ గెలిచింది. ఈ సంద‌ర్భంగా పోలీస్ అధికారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకర్షించింది. అనంత‌రం రామ్ చరణ్ మాట్లాడుతూ.. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పిలుపు మేరకు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2021లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నపోలీసులకు శాల్యూట్ అన్నారు. తాను గెలుపు కన్నా ఓటముల నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాన‌ని, క్రీడాలతో ఫిట్‌నెస్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాల రక్షణకు ముందు వరుసలో నిల్చున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తెలంగాణ పోలీసులకు శాల్యూట్ అన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసిన సైబరాబాద్ సిపిని ఆయన అభినందించారు.

విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న రామ్ చ‌ర‌ణ్ తేజ‌, చిత్రంలో సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్

అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపురి రమేశ్ మాట్లాడుతూ దేశం కోసం ఆడాలన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతోపాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ప్రతి సంవత్సరం జరపాలన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసులు ఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాల‌ని, సిబ్బంది ఫిట్‌నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక‌ప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాల‌ని, వీలున్నప్పుడు కుటుంబ‌ సభ్యులతో సమయాన్ని గ‌డపాలన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్ తేజ‌, నాగపురి రమేశ్, సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్, ఎంఎం కీర‌వాణి, అనూప్ రూబెన్స్

అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2021 ముగింపు కార్యక్రమానికి పిలవగానే నటుడు రామ్ చరణ్, అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపురి రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్లు కీరవాణి, అనూప్ రూబెన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ప్రారంభించిన ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లో వారి పిలుపుతో 8000 మంది ప్లాస్మా డొనేట్ చేశారన్నారు. ప్లాస్మా డొనేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన సినీ నటుడు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.

సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం వరుసగా ఇది మూడవసారి అన్నారు. సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జనవరీ 30వ తేదీన ప్రారంభ‌మై మంగ‌ళ‌వారం ముగిసిందన్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో 7 టీమ్ లు మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్, శంషాబాద్ జోన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ వింగ్, ట్రాఫిక్ వింగ్, మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర పోటీలు నిర్వహించామన్నారు. ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నార‌ని తెలిపారు.

ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ మాట్లాడుతూ.. క్రీడలు నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయ‌ని ఓ జర్మన్ తత్వవేత్త చెప్పిన మాటను ఉదహరించారు. ఆటల్లో గెలుపోటములనేవి సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడలు మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు.

అనంతరం చీఫ్ గెస్ట్ లు గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడల్లో గెలిచిన వారికి రామ్ చరణ్, నాగపురి రమేశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ లు బహుమతుల‌ను అందజేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ వర్సెస్ మీడియాకు జరిగిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన మీడియా ప్రతినిధులకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, ఎంఎం కీరవాణి, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, బాలానగర్ డిసిపి పద్మజ‌, వుమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డిసిపి అనసూయ, ఏడీసీపీ క్రైమ్స్ I కవిత, ఏడీసీపీ క్రైమ్స్ II ఇందిర‌, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య, ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ‌ యేదుల, ఏసీపీలు సంతోష్ కుమార్, లక్ష్మి నారాయణ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, సెక్షన్ల సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here