గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి సర్కిల్ డీసీ వెంకన్నకు కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఈఈ వెంకటేశ్వర్లును కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కాలనీలో వర్షపు నీటి కోసం ఓపెన్ నాలాను నిర్మించాలని, కొన్ని ఏరియాల్లో డ్రైనేజీ పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని, కనుక కొత్త లైన్లను నిర్మించాలని, వరద నీటి కోసం యూజీడీ లైన్లను నిర్మించాలని, పార్కులో వర్షాల వల్ల కూలిన కాంపౌండ్ వాల్ను వెంటనే నిర్మించాలని, కాంపౌండ్ వాల్ పైన వైర్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని, గతంలో నిర్మించిన వరద నీటి కాలువ పైప్లైన్ల స్థానంలో కొత్తగా 1 అడుగు డయా పైప్లైన్లను నిర్మించాలని కోరామని తెలిపారు. ఇందుకు డీసీ, ఈఈలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాసీం, సభ్యులు శేఖర్ రావు, విల్సన్, ఎస్కే రాజా, రామ్మోహన్ రావు, సుబ్బయ్య ఉన్నారు.





