శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కార్యాలయం పేరును మియాపూర్ సర్కిల్ గా మార్చాలనే ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అక్బర్ ఖాన్ తో కలిసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోఖడేని కలిసి ఈ విషయంపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఈ సర్కిల్ కార్యాలయం చందానగర్లోనే కొనసాగుతోందని, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇది చందానగర్ సర్కిల్ గానే సుపరిచితమని ఆయన గుర్తు చేశారు. చందానగర్, మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల ప్రజలు ఏ అవసరానికైనా ఈ కార్యాలయానికి వస్తుంటారని, ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దీనికి చందానగర్ పేరు ఉండటమే సబబని పేర్కొన్నారు. కార్యాలయం చందానగర్లో ఉండి, పేరు మాత్రం మియాపూర్ సర్కిల్ అని మార్చడం వల్ల సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతారని, దీనివల్ల ప్రజలకు అనవసర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం, వారి మనోభావాలను గౌరవిస్తూ ప్రస్తుతం ఉన్న చందానగర్ సర్కిల్ పేరునే యథాతథంగా కొనసాగించాలని కమిషనర్ను ఆయన కోరారు.






