శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): సరైన పోషణ ఆరోగ్యవంతమైన బిడ్డ భవిష్యత్తుకు నాంది అని ఐసీడీఎస్ శేరిలింగంపల్లి ప్రాజెక్ట్ ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్ వైజర్ ఠాకూర్ కోమలాబాయి అన్నారు. ఓల్డ్ హఫీజ్పేట హరిజన బస్తీ అంగన్వాడీ కేంద్రంలో మొదటి వేయి రోజులు తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకి రెండు సంవత్సరాలు నిండే వరకు తీసుకోవల్సిన ఆహారం, అనుబంధ పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. మొదటి 6 నెలల వరకు తల్లిపాలు కచ్చితంగా ఇవ్వాలని, 7వ నెల నుంచి తల్లిపాలతోపాటు అదనపు ఆహారం.. అంటే ధాన్యాలు, పప్పులు, గుడ్డు, కూరగాయలు, పండ్లు పెట్టాలని అన్నారు. దీని వల్ల మెదడు అభివృద్ధి, శారీరక ఎదుగుదల, రోగ నిరోధక శక్తి, చదువు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శిల్ప, రాధ, జ్యోతి, స్వరూప, వసంత, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






