శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను మదీనాగూడలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. మల్లంపాటి రాహుల్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరెకపూడి గాంధీ, వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లంపాటి రాహుల్ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమని, ప్రజాసేవకు కొత్త దారులు చూపించిన మహానేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

అనంతరం వి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. అనంతరం రాహుల్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





