- అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ ద్వారా నిరుద్యోగులకు, స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ వాహనాలను సబ్సిడీ కింద అందజేస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. వాహనం విలువ రూ.10 లక్షలు ఉంటుందని, అందులో 60 శాతం వరకు.. అంటే.. రూ.6 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. బ్యాంకు రుణం 40 శాతం వరకు.. అంటే.. రూ.4 లక్షలు లభిస్తుందని తెలిపారు. కనుక అర్హులైన వారు సంఘాల ద్వారా జనవరి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతీ యువకులు, డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంచార వాహనం ద్వారా యువత, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఒక వార్డులో ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎంపిక ప్రక్రియ లాటరీ విధానంలో జరుగుతుందని తెలిపారు. అలాగే దరఖాస్తుదారుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ శేరిలింగంపల్లి ప్రతినిధులను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆరెకపూడి గాంధీని సదరు ప్రతినిధులు కలిశారు. అనంతరం సంచాన వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ శేరిలింగంపల్లి అధ్యక్షుడు కిష్టయ్య, సెక్రటరీ మల్లేష్ పాల్గొన్నారు.






