నమస్తే శేరిలింగంపల్లి: సురభి కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నానాటికి అంతరించిపోతున్న నాటక కళలను సురభి కళాకారులు ఎన్ని ఒడుదొడుకులనైనా ఎదుర్కొంటూ ప్రాచుర్యం పొందుతున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ, ఆవేటి మనోహర్ సురభి కళామందిరం సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజుల నాటక శిక్షణా శిబిరం ముగింపు వేడుకలను శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్థల పురాణం ఆధారంగా రూపొందించిన శ్రీ యాదాద్రి మహోద్భావం పౌరాణిక నాటకం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదని, ప్రఖ్యాత తెలుగు సినీనటీ మణులు, సురభి కళాకారుల కుటుంబంలో నుంచి వచ్చినవారేనని అన్నారు. వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన మాయాబజార్ నాటకం ను గుర్తు చేసుకున్నారు. కళారంగంలో కళారాధకుల హృదయాల్లోనూ, సురభి కుటుంబ సభ్యులకు ప్రత్యేక స్థానం నెలకొని ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాటక రంగాన్ని అన్నివిధాలా ప్రోత్సాహిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం సురభి నాటక కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సురభి నాటక మండలి సంస్థ మాజీ అధ్యక్షుడు కోదండరాం, దర్శక, నిర్మాత రచయిత రఘునాథ్, సభ్యులు, ముఖ్యనాయకులు, నాటక ఔత్సాహికులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
