నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చెరువుల సుందరీకరణ పనులు చేపట్టి అభివృద్ధి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాయనమ్మ కుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను ఇరిగేషన్ అధికారులతో కలసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నగర్ కాలనీ వద్ద గల నాయనమ్మకుంట చెరువు అభివృద్ధి లో భాగంగా చెరువు సుందరీకరణ, సంరక్షణతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. చెరువు సుందరికరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్టను బలోపేతం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నళిని, రూప తదితరులు పాల్గొన్నారు.






