శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖను మిద్దెల మల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరారు. ముఖ్యంగా మంజీరా రోడ్డులో స్ప్రింగ్ వ్యాలీ స్కూల్ ఎదుట ఉన్న డ్రైనేజ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆ డ్రైనేజ్ను కల్వర్టుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే మదీనాగూడ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేజ్-3లో ఉన్న పార్కును అభివృద్ధి చేసి స్థానికులకు ఉపయోగపడేలా చేయాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల క్షేమమే తన ధ్యేయమని తెలిపారు. భవిష్యత్తులో మదీనాగూడ డివిజన్కు సేవ చేసే అవకాశం లభిస్తే, గ్రేటర్ హైదరాబాద్లోనే ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే మదీనాగూడ డివిజన్ అభివృద్ధి దిశగా ప్రజలు తనను ఆశీర్వదించి భవిష్యత్తులో సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.





