శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు, ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుందని అన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ, ముందుకు సాగితే ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాద్యాయుడు శ్రీనివాసులు, ఉపాద్యాయులు రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లత, రోజా, నాయకులు సయ్యద్ గౌస్, సంఘ, దేవేందర్, అమన్, బాలరాజు సాగర్, సందీప్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, నర్సింహ గౌడ్, టోనీ, విజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.