నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులతో బుదవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి లేకుండా చూడలని, అందరిని సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలన్నారు. వేసవి కాలంలో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 18 రిజర్వాయరాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటింకి స్వచ్చమైన మంచినీరు అందిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా చిన్న సమస్య ఏర్పడితే వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడలని, అదేవిధంగా ఎక్కడైనా మిగిలిపోయిన ప్రాంతలు, నెట్వర్క్ లేని ప్రాంతాలు, కలుషిత ప్రాంతాలు, రీప్లేస్మెంట్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే వాటిని అరికట్టి తాగునీరు వృదా కాకుండా చూడాలని, ప్రతీ ఇంటికి తాగు నీరు అందించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జలమండలి అధికారులు డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్లు నివర్తి, వెంకట్ రెడ్డి, యాదయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
