శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని న్యూ శంకర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని PAC చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, దాతల సహకారంతో భవనాన్ని నిర్మించి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ భవనాన్ని కాలనీ సంక్షేమానికి ఉపయోగించుకోవాలని సూచించారు. చిన్న సమావేశాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని గాంధీ కోరారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాలనీలో పలు మౌలిక వసతులు కల్పించామని, న్యూ శంకర్ నగర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు రఘునాథ్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, ప్రవీణ్ రెడ్డి, న్యూ శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





