శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గం చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, సీఎంసీ డీసీ బాలకృష్ణ, అదనపు డీసీపీ ట్రాఫిక్, మాదాపూర్ ఏసీపీ (ఎల్అండ్ఓ), ఏసీపీ ట్రాఫిక్తో పాటు మాదాపూర్ ఎల్అండ్ఓ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలు దుర్గం చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ పాయింట్లు, బారికేడింగ్, కంట్రోల్ రూమ్, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను అధికారులు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.





