శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఓల్డ్ హఫీజ్పేట్లో హిందూ సమ్మేళన ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం ఇస్కాన్ కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నరేందర్ స్వాగత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా భజరంగ్ దళ్ యువకులు ప్రదర్శించిన శంభాజీ మహారాజ్ వీరగాథ నాట్యరూపకం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. గోపి మాస్టర్ విద్యార్థుల ఓం నమః శివ రుద్రాయ అఘోర వేషధారణ నృత్యం, వసంత గురువు విద్యార్థుల గురుర్ బ్రహ్మ నృత్యం విశేషంగా అలరించాయి.

సమాజంలోని పెద్దలు పిల్లల ప్రతిభను మెచ్చుకుని నగదు బహుమతులు ప్రకటించడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. అతిథుల సందేశాలు ప్రేరణాత్మకంగా నిలిచాయి. జయప్రద దేవి కుటుంబ విలువలను, శివాజీ మహారాజ్ జీవితాన్ని ఉదాహరణగా వివరించారు. కమలాకర శర్మ ధర్మాన్ని అనుసరించడం జీవిత విజయానికి మార్గమని చెప్పారు. ముఖ్య అతిథి వెంకటేష్ RSS 100 సంవత్సరాల సేవలు, హిందూ ఐక్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఓల్డ్ హఫీజ్పేట్ యువత, పెద్దలు సమిష్టిగా నిర్వహించి వేలాది మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. మొత్తం కార్యక్రమం ఐక్యతను ప్రతిబింబించింది.
కార్యక్రమం ముగింపులో హిందూ సమ్మేళనం ఓల్డ్ హఫీజ్పేట్ అధ్యక్షుడు మరోజు ఆచార్య, గౌరవ అధ్యక్షుడు నరహరి పటేల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ హఫీజ్ పేట్ తోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన 11 కాలనీల వాసులు, నాయకులు పాల్గొన్నారు.





