శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను సమీకరించే పేరుతోహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏప్రిల్ 8 నుండి 15 వరకు వేలం వేయనుంది. గత ప్రభుత్వ మాదిరిగానే ప్రభుత్వ భూములను వేలం వేస్తూ ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు ధారా దత్తం చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ భూములను వేలం వేయకూడదు విద్యా సముదాయాల అభివృద్ధి కోసం ఈ భూములను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హెచ్ సి యు లోని విద్యార్థి సంఘాలు,విద్యార్థులు చేస్తున్న విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఆ భూములలో చెట్లను సదును చేస్తూ భూమిని వేలం వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం, రాత్రిపూట అరెస్టులు చేయడం, క్యాంపస్ రూములలో ఉంటున్న విద్యార్థులపై అమానుషంగా పోలీసులు ప్రవర్తించడం రాష్ట్ర ప్రభుత్వ పాలన పరాకష్టాత్వాన్ని గుర్తుచేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామనే కల్లబొల్లి మాటలు తెలిపి విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదు. పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీఛార్జ్, అక్రమ అరెస్టులు, భయ బ్రాంతులకు గురి చేయడం లాంటివి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్ సి యు భూములలోని గజం స్థలం కూడా వేలం వేయకుండా విద్య సముదాయానికి పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలర్థం కాపాడవలసిన ప్రభుత్వ భూములను కార్పొరేట్ పెట్టుబడిదారి సంస్థలకు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే గత ప్రభుత్వాల వలె ప్రజా వ్యతిరేకతను చవి చూడవలసి వస్తుందని అన్నారు.