శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో జరుతున్న పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నాలా విస్తరణ పనులలో భాగంగా రూ.18 కోట్ల 92 లక్షలతో నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం పనులను సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ SNDP ఫేజ్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దానిలో భాగంగా రూ.18 కోట్ల 92 లక్షలతో పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నూతనంగా చేపట్టబోయే నాలా విస్తరణ పనులను వేగంగా చేయాలని అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నాలాల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఏ చిన్న సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , వెంకటేశ్వర రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






