శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, శానిటేషన్, హార్టికల్చర్, జలమండలి విభాగం, వీధిదీపాలు, విద్యుత్ అధికారులు, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లో పర్యటించి సమస్యలను తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. అలాగే ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హార్టికల్చర్ విభాగం దాసు, శానిటేషన్ విభాగం రమేష్, వీధిదీపాల విభాగం సుధాకర్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, సునీల్, విద్యుత్ లైన్ మెన్ పాండు, కాలనీ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






