నమస్తే శేరిలింగంపల్లి: దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. క్షేత్ర వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పెన్నార్ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పివీ రావు, రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ గొట్టిపాటి చంద్రశేఖర రావులు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపడంతో పాటు విలువలతోను కూడిన భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని పెంపొందించే కార్యకలాపాలు నిర్వహించుకోవడం అభనందనీయమని అన్నారు. ఈ క్రమంలో భారతీయం సత్యవాణిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సిబ్బంది, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
