శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గోపనపల్లిలోని రంగనాథ స్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 268 భూమిని ఎండోమెంట్ ఈవో ఆంజనేయులు గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఆలయ భూమిలో అక్రమంగా రహదారి వేయడం జరుగుతోందని గ్రామస్థులు తెలియజేయడంతో ఆయన తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రహదారి వేసే ప్రయత్నాన్ని జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించినట్టు ఈవో గుర్తుచేశారు. మాన్యం భూమిలో మరోసారి అక్రమంగా రోడ్ వేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం సర్వే నెంబర్ 268లో ఏర్పడిన మట్టిరహదారిని మరో రెండు రోజుల్లో జెసిబితో పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గ్రామస్థులు, సంబంధిత సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రమే ఉపయోగించాలని ఆయన సూచించారు. ఆయన వెంట గ్రామస్తులు శంకరి రాజు ముదిరాజ్, ఈ. అనిల్ కుమార్, పల్లపు నర్సింగ్ రావు, పల్లపు చంద్రమౌళి, పల్లపు సత్యనారాయణ, శంకర్ నాయక్, నరేష్ నాయక్, గడ్డం శ్రీకాంత్, ముద్దంగుల రాజు, ఈర్గదిండ్ల రాజు, ఈర్గదిండ్ల నరసింహ, నరేష్, గడ్డం రాము, జోగు కృష్ణ, గడ్డం అర్జున్, గడ్డం పరశురాం తదితరులు ఉన్నారు.






