చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల వాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరిస్తామని కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని భవానీపురం కాలనీలో స్థానికులతో కలిసి ఆమె సమావేశమయ్యారు.

భవానీపురం కాలనీలో మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఓ మహిళా భవనం నిర్మించాలని, ట్రాన్స్ఫార్మార్లను మార్చాలని, కాలనీ లే అవుట్లో ఉన్న పార్క్కు కాంపౌండ్ వాల్ను నిర్మించాలని స్థానికులు కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డిని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు.

కరోనా విషయంలో ఎవరూ భయాందోళనలకు గురి కావల్సిన పనిలేదని కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రావు, పర్వత రెడ్డి,హేమాద్రి, శ్యామల, పద్మ, వాసవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
