శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. గురువారం కొండాపూర్ మసీదుబండ బీజేపీ కార్యాలయంలో బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్, రవీందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు నరేష్ తో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నరేళ్లు సమయం ఇచ్చామని, ఏమైనా చేస్తారేమోనని అనుకుంటే ఇప్పటికీ ఇంకా అవే మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని అన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీని కోసం నియోజకవర్గంలోని ప్రతి బూత్ లో బూత్ కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీల సభ్యులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటే ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను వివరించి వీలైనంత ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ బలపేతానికి కృషి చేయాలన్నారు. అలాగే అంబేద్కర్ జయంతి వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి బూత్ లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర , జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పదాధికారులు, వివిధ మోర్చల నాయకులు పాల్గొన్నారు.





