శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మాధవరం నగర్ కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఉద్యమకారులు, స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి తెలంగాణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోట్లాది ప్రజల ఆకాంక్షలతోపాటు ఉద్యమకారులు, విద్యార్థులు, యువత చేసిన త్యాగాల ఫలితమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేయడం వల్లే అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలకు మళ్లీ పాత పరిస్థితులను గుర్తు చేసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, దంతాలపల్లి బాబురావు, లక్ష్మీనారాయణ, వేముల ఆంజనేయులు, మధు, జగదీష్ గౌడ్, ప్రవీణ్, రవీందర్రావు, వెంకట్ రెడ్డి, కొండలరావు, కిషన్, నరసింహారెడ్డి, రమణారెడ్డి, యశ్వంత్, టి. కృష్ణారావు, వేణు, సోమయ్య, అనిల్, రామచందర్, మోహన్రావు, శ్రీధర్, శేఖర్, మురళి, మాధవి రెడ్డి, శైలజ, కరుణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.





