శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి కొండాపూర్ అంజయ్యనగర్లోని హెచ్-సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని గురువారం ఉదయం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ), సిటీ ప్లానర్ (సీపీ), డిప్యూటీ కమిషనర్తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పురోగతిపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పూర్తయితే కొండాపూర్ మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, వాహనదారులకు మెరుగైన రాకపోకల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. హెచ్-సిటీ ప్రాజెక్టు అమలుతో కొండాపూర్ ప్రాంతంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.





