శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, రిజర్వేషన్లు అందించే విషయంలో ప్రభుత్వాలు బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడకగా ఉందని అన్నారు. కుల గణన వల్ల వెనుకబడిన వర్గాలకు బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీరని అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసుకొని దామాషా పద్ధతిన బీసీలకు అందరికీ న్యాయమైన రిజర్వేషన్లు అందేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని భేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వానికి సూచించారు.