- కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: బీసీ పొలిటికల్ ఫ్రంట్
శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 15న కామారెడ్డిలో జరగబోయే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ప్రతిఒక్కరూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బహుజన రాజ్య స్థాపన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీల అభివృద్ధి కోసం ₹20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోతాం అని ప్రకటించారు.
యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చట్ట సభల్లో మేమెంతో మాకంత వాటా కావాలి. పథకాలు మాకు, పట్టాభిషేకాలు మీకా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు అంబాల నారాయణ గౌడ్, వి. నాగభూషణం, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, బడేసాప్, నెర్దం భాస్కర్, మెట్టు దన్రాజ్, ఓయూ జాక్ నాయకులు సాంబశివ గౌడ్, పంజాల రాజు తదితరులు పాల్గొన్నారు.





