నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంట చెరువును సోమవారం జనంకోసం అద్యక్షుడు కసిరెడ్డి భాస్కర్రెడ్డి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ సందర్శనలో రెవెన్యూ, ఇరిగేషన్ లీలలు కొట్టొచ్చినట్టు కనిపించాయని అన్నారు. అక్రమ నిర్మాణాలు, కట్టమీదనే బాజాప్తా వాటర్ ప్లాంట్ నిర్మాణం కనిపించింది అన్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు, దళారులు, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మిలాఖత్ ఐ వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి సిగ్గు లేకుండా కుంటను, కట్టను, నాళాను ఇలా మొత్తం కబ్జా చేశారని ఆరోపించారు. ఏ ఫిర్యాదు చేసినా, నేనేం చేయాలి, నాకు సహకరించే స్టాఫ్ లేదని తహసీల్దార్ వాపోవడం, తన బాధ్యతలను విస్మరించడం షరా మామూలైందని అన్నారు. ఇటీవల బచ్చుకుంటలో వెలిసిన ఒక నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా రెండు రంధ్రాలు చేసి వదిలేశారని అన్నారు. చెరువులను, కుంటలను, నాళాలను కాపాడడంలో వైఫల్యం చెందిన శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్ వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని జనంకోసం తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అన్ని కబ్జాలపై సమగ్ర దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
