శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): కొత్తగూడ ప్రశాంత్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయంలో చిన్నారుల కోసం ప్రత్యేక ఆయుర్వేదిక్ డ్రాప్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పుట్టిన శిశువుల నుంచి 16 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ డ్రాప్స్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నారులకు మూడు చుక్కల చొప్పున డ్రాప్స్ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మేధో వికాసం మెరుగుపడటంతోపాటు విద్యలో, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

డాక్టర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ డ్రాప్స్ను సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు. కొందరు దాతలు ముందుకు వచ్చి ప్రజలకు ఉచితంగా డ్రాప్స్ అందించేలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జంగం గౌడ్, పి. నర్సింహులు, కులకర్ణి, సత్యనారాయణ రాజు, నర్సింహ తదితర దాతలు సహకరిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందిస్తూ, మరింత మంది దాతలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చికిత్స లేదా మందులను ఉపయోగించే ముందు తల్లిదండ్రులు సంబంధిత అర్హత కలిగిన వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.





