శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): ఆలిండియా యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా యాదవులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (ఎస్ఐఆర్)లో యాదవులందరూ తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ సర్వే ద్వారా యాదవుల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

యాదవ సమాజం ఐక్యత, అభివృద్ధి కోసం ఆలిండియా యాదవ మహాసభ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో యాదవ యువత ముందుండి రాణించాలని, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ ఆధ్వర్యంలో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా యాదవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల యాదవ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.





