శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన అభిజ్ఞ అమెరికాలో నిర్వహించిన భరతనాట్య అరంగేట్రంతో అందరి ప్రశంసలు అందుకుంది. నియోజకవర్గంలోని టాకీ టౌన్ సమీపంలో నివాసం ఉండి, గత పదేళ్లుగా అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడిన శ్వేత రమణ రెడ్డి దంపతుల ప్రథమ కుమార్తె అభిజ్ఞ అరంగేట్రం జూలై 18న అత్యంత వైభవంగా జరిగింది. భారతీయ సాంప్రదాయ నృత్యకళకు ప్రతీకగా నిలిచే ఈ అరంగేట్రంలో అభిజ్ఞ తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె ప్రదర్శనకు గురువులు, తల్లిదండ్రులు, ఆహ్వానితులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి 500 మందికి పైగా తెలుగు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరై అభిజ్ఞను అభినందించారు. కళారంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తమ పిల్లలకు అందిస్తూ, భారతీయ కళలను ప్రోత్సహిస్తున్న శ్వేత రమణ రెడ్డి కుటుంబాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కుమారి అభిజ్ఞకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, భరతనాట్యంతో పాటు కళారంగంలో మరెన్నో విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.





