శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ సర్వేనెంబర్ 44 లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, సదరు భవనాలను సీజ్ చేయాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి.సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. సీజ్ చేయబడిన భవనాల వద్ద అధికారులు ఉంచిన బోర్డులను సైతం కొందరు అక్రమార్కులు తొలగించి యథేచ్ఛగా అక్కడ మళ్లీ నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కొందరు అలాంటి అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ మామూళ్లు తీసుకుని సదరు భవనాలను చూసీ చూడకుండా వదిలేస్తున్నారని అన్నారు. పేదలు గుడిసెలు నిర్మించుకుంటే తొలగించే అధికారులు బడాబాబుల నిర్మాణాల వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ప్రశ్నించారు. సర్వే నంబర్ 44లో ఉన్నదంతా ప్రభుత్వ భూమి అని, గతంలోనే దీనిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. 200, 150, 100 గజాల్లో భవనాలను నిర్మిస్తున్నారని, వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, భవనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.






