శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ సినీనటుడు నటభూషణ శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా వైజాగ్ డాబా గార్డెన్స్లోని విజెఎఫ్ వద్ద వైజాగ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన శోభన్ బాబు కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ (న్యూ డిల్లీ) జాతీయ అధ్యక్షుడు నెల్లి గురుదేవ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభన్ బాబు తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన మహానటుడని, కుటుంబ విలువలను ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు యువి.రావ్ ఉప్పినివలస, మహిళ ప్రతినిధులు పెలివల ఈశ్వరి, అనురాధ, తుని మణి తదితరులు పాల్గొని శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. శోభన్ బాబు చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.






