నమస్తే శేరిలింగంపల్లి: మాదక ద్రవ్యాల నివారణకు యువత నడుం బిగించాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ గాంధీ నాయక్, ఎస్ఐలు శ్రీనివాసులు, వీరబాబులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థి దశ నుంచే మంచి క్రమశిక్షణ అలవర్చాలని, మంచి చెడులపై విద్యార్థులకు లోతైన విశ్లేషణలతో అవగాహన కల్పించాలని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు.