- లాక్ డౌన్ కారణంగా కేంద్రాల మూసివేత.. ప్రస్తుతం తెరిచారు..
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో మొత్తం 120 ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆయా కేంద్రాలను మూసి వేశామని, ప్రస్తుతం ఆయా కేంద్రాలను తెరిచామని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. వాటిల్లో పౌరులు ఆధార్ సేవలను పొందవచ్చని తెలిపారు.
ఆయా కేంద్రాల్లో పౌరులు కొత్త ఆధార్ కార్డులకు ఎన్రోల్ చేసుకోవడంతోపాటు ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చని, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని, అందుకు గాను నిర్దిష్టమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.





