– 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారి దర్శనం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దేవాలయాలైన చందానగర్ వెంకటేశ్వరాలయంలోని భవానీమాత, శిల్పఎన్క్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, అన్నపూర్ణ ఎన్క్లేవ్ శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, తారానగర్లోని శ్రీ తుల్జాభవానీ మాత, దీప్తీశ్రీనగర్ శ్రీధర్మపురి క్షేత్రంలోని సరస్వతీదేవి, శాంతనగర్లోని పోచమ్మతల్లి, నెహ్రూ నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, వేముకుంటలోని శ్రీ లలితా పోచమ్మ తల్లి, గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయాల్లోని అమ్మవార్లు తొమ్మిదవ రోజు విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారాంలో భక్తులకు కనువిందు చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. చివరి రోజు విజయదశమి వేళ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరోనా విజృంభన కొనసాగుతన్నప్పటికి ఉత్సవాల నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉత్సవాలను విజయవంతం చేశారు.






