శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ 6వ నంబరు ప్లాట్ ఫామ్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ దగ్గర ఓ వృద్ధుడి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయస్సు సుమారుగా 80 ఏళ్లు ఉంటుందని, చొక్కా లేకుండా దుప్పటి కప్పుకుని ఉన్నాడని, బహుశా యాచకుడిగా జీవనం సాగిస్తూ ఉంటాడని, ఆకలి, చలి కారణంగా మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.






