శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మాధాపూర్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్ పరిధుల్లో కూడా అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు అయిన నిందితుడు సందీప్ కుమార్ రెడ్డి (24) వృత్తిరీత్యా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. బాచుపల్లి సాయినగర్ లో నివాసం ఉండే అతను ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. తన అలవాట్ల కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు రాత్రి వేళల్లో హోటళ్లు, హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించేవాడు. దొంగిలించిన వస్తువులను విక్రయించి ఆ డబ్బును ఆన్లైన్ బెట్టింగ్, ఇతర యాప్లలో ఖర్చు చేసేవాడు.

దర్యాప్తు సమయంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. అనుమానితుడి చిత్రాన్ని MSCD (మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్) ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పరీక్షించగా, అది కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో నమోదైన పూర్వ కేసుతో సరిపోలింది. ఈ ఆధారాలపై నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన 31 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మాత్రమే కాకుండా, బాచుపల్లి, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్బీ, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. తమ ఇళ్లు, వ్యాపార ప్రాంగణాలకు సురక్షితంగా తాళాలు వేసుకోవాలని, ముఖ్యంగా హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు కాల్ చేయాలని తెలిపారు. కేసులను ఛేదించి, దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని పట్టుకున్నందుకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. మాదాపూర్ డివిజన్ ఏసీపీ ఈ సందర్భంగా బృందం కృషిని ప్రశంసించారు.





