ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌.. మ‌రో ముఠా గుట్టు ర‌ట్టు..

  • న‌లుగురు నిందితుల‌ అరెస్టు, ప‌రారీలో ఇద్ద‌రు
  • యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తారు, చెల్లించ‌క‌పోతే వేధిస్తారు
  • బాధితుల ఫిర్యాదుతో సైబ‌ర్ క్రైమ్ పోలీసుల చ‌ర్య‌లు
  • యాప్స్ కాల్ సెంట‌ర్లపై దాడులు, నిందితుల అరెస్టు
  • 2 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం
  • రూ.2 కోట్ల డిపాజిట్ ఉన్న బ్యాంక్ ఖాతా సీజ్

సైబ‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మ‌రో ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు. ఇప్ప‌టికే ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేయ‌గా, అలాంటి యాప్‌ల‌ను నిర్వ‌హిస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను తీవ్ర‌మైన వేధింపుల‌కు గురి చేస్తున్న ఇంకో కంపెనీకి చెందిన నిర్వాహ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. గ‌చ్చిబౌలిలోని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

విలేకరుల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న సీపీ వీసీ సజ్జ‌నార్

ఈ నెల 17వ తేదీన ఓ బాధితుడు సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. తాను ఆగ‌స్టు 25, 2020వ తేదీన ఓ ఇన్‌స్టంట్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నాన‌ని తెలిపాడు. ఆధార్‌, పాన్ కార్డు, ఫొటో, 3 నెల‌ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల‌ను స‌ద‌రు యాప్‌లోకి అప్‌లోడ్ చేయ‌గా.. వారు రూ.415ను జీఎస్‌టీ, ప్రాసెసింగ్ ఫీజు కింద క‌ట్ చేసుకుని రూ.2015 లోన్‌కు గాను రూ.1600 లోన్‌ను 7 రోజుల కాల‌వ్య‌వ‌ధితో ఇచ్చార‌ని తెలిపాడు. అనంత‌రం త‌న‌కు భిన్న ర‌కాల ఫోన్ నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌చ్చాయ‌ని, వారు త‌మ యాప్‌ల నుంచి లోన్లు తీసుకోవాల‌ని చెప్పార‌ని అన్నాడు. దీంతో 28 యాప్‌ల నుంచి మొత్తం రూ.1.20 ల‌క్ష‌లు అప్పు తీసుకోగా వ‌డ్డీతో స‌హా రూ.2 ల‌క్ష‌లు చెల్లించాన‌ని అన్నాడు. అయిన‌ప్ప‌టికీ ఇంకా అప్పు మిగిలి ఉంద‌ని చెప్పి త‌న‌కు నిత్యం ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్నార‌ని, త‌న‌ను కాల్స్ లో బెదిరిస్తున్నార‌ని, లీగ‌ల్ నోటీసులు ఇస్తామ‌ని చెప్పార‌ని అన్నాడు. దీంతో ఆ బాధితుడితోపాటు మొత్తం 8 కేసుల‌ను మిగిలిన బాధితుల ఫిర్యాదుతో న‌మోదు చేసిన సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు స‌ద‌రు యాప్‌ల‌కు చెందిన కంపెనీపై దాడులు నిర్వ‌హించారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు

ఆ బాధితుల‌కు లోన్ల‌ను ఇస్తున్న‌ది ఢిల్లీ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న స్కైలైన్ ఇన్నోవేష‌న్స్ టెక్నాల‌జీస్ కంపెనీగా పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన కాల్ సెంట‌ర్లు న‌గ‌రంలో రెండు ఉన్నాయి. ఒక‌టి బెస్ట్ షైన్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌. మ‌రొక‌టి క్యుబెవో టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌. ఈ క్ర‌మంలోనే పోలీసులు ఆయా కాల్ సెంట‌ర్ల‌పై దాడులు చేశారు. మొత్తం ఆరుగురు నిందితులు కాగా వారిలో న‌లుగురి పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు ప‌రారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

స్కైలైన్ కంపెనీ నిర్వాహ‌కులు

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఢిల్లీకి చెందిన యిబాయ్ అలియాస్ డెన్నిస్‌, రాజ‌స్థాన్‌కు చెందిన స‌త్య‌పాల్ ఖాలియా, న‌గ‌రానికి చెందిన అనిరుద్ మ‌ల్హోత్రా, క‌డ‌ప జిల్లాకు చెందిన ముర‌తోటి రిచీ హేమంత్ సేత్‌లు ఉన్నారు. కాగా మిగిలిన ఇద్ద‌రు నిందితులు జిషియా జాంగ్‌, ఉమాప‌తి అలియాస్ అజ‌య్‌లు స్కైలైన్ కంపెనీకి డైరెక్ట‌ర్లు కాగా వారు ప‌రారీలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరి నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్కైలైన్ కంపెనీకి చెందిన రూ.2 కోట్ల వ‌ర‌కు న‌గ‌దు ఉన్న ఓ బ్యాంక్ అకౌంట్‌ను పోలీసులు సీజ్ చేశారు.

కాగా వారు లోన్ గ్రామ్‌, లోన్ ట్రెయిన్‌, క్యాష్ బ‌స్‌, ట్రిపుల్ ఎ క్యాష్, సూప‌ర్ క్యాష్, మింట్ క్యాష్, హ్యాపీ క్యాష్, లోన్ కార్డ్‌, రీపే వ‌న్‌, మ‌నీ బాక్స్‌, మంకీ బాక్స్ అనే ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేసి వాటి ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు రుణాల‌ను ఇచ్చేవారు. గ‌త కంపెనీలాగే వీరు కూడా రుణాల‌ను చెల్లించ‌ని వారిని గ‌డువు తేదీ ముగిశాక తీవ్ర‌మైన వేధింపుల‌కు గురి చేసేవారని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఇలాంటి యాప్స్ ను సృష్టించిన కంపెనీల‌పై రానున్న రోజుల్లోనూ దాడులు చేస్తామ‌ని, ఆర్‌బీఐ అనుమ‌తి లేకుండా రుణాల‌ను ఇస్తున్న యాప్‌ల‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని, బాధితులు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్ద‌ని, ఫిర్యాదు చేస్తే క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఆ యాప్ కంపెనీల‌పై కేసులు న‌మోదు చేస్తామ‌ని.. సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు. ప్ర‌జ‌లు అనుమ‌తి లేని యాప్‌ల నుంచి రుణాలు తీసుకోవ‌ద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here