ఆర్మీ, పోలీసు అధికారుల‌మ‌ని చెప్పి డ‌బ్బులు వ‌సూలు

  • ముగ్గురు వ్య‌క్తుల అరెస్టు
  • ప‌లు సామ‌గ్రి స్వాధీనం

సైబ‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీసు, ఆర్మీ అధికారుల‌మ‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ వారి నుంచి డ‌బ్బుల‌ను వ‌సూలు చేస్తున్న ఓ ముఠాకు చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ జోన్ డీసీపీ కార్యాల‌యంలో డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ఈ మేర‌కు బుధ‌వారం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, చిత్రంలో నిందితులు వాడిన ఆర్మీ యూనిఫాంను చూపిస్తున్న పోలీసులు

ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పూడూరు మండ‌లం కొమ్ముచిక్క‌ల గ్రామానికి చెందిన నాగ‌రాజు కార్తీకేయ ర‌ఘువ‌ర్మ అలియాస్ కార్తీక్ సింగ్ అలియాస్ ర‌ఘు వ‌ర్మ అలియాస్ మేజ‌ర్ కార్తీక్ (22) 2017లో ఆర్మీ సెలెక్ష‌న్స్ కు వెళ్లాడు. కానీ ఆర్మీకి ఎంపిక కాలేదు. అయిన‌ప్ప‌టికీ అత‌ను త‌న సొంత గ్రామంతోపాటు ప‌లు ప్రాంతాల్లో ఆర్మీ అధికారిన‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు. అనంత‌రం ప‌లువురిని బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌నిపై ఫిర్యాదులు రాగా కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అత‌న్ని గ‌తంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ అత‌ను అదే ప‌నిచేయ‌సాగాడు. ఈ క్ర‌మంలో అత‌నికి పైల స్వామి స‌త్య‌నారాయ‌ణ‌, దీప‌క్ కుమార్ బోరా అలియాస్ దీప‌క్ (23), గ‌డ్డం అనిల్ కుమార్ (35), శ్రీ‌ను అనే వ్య‌క్తులు ప‌రిచ‌యం అయ్యారు. ఈ క్ర‌మంలో అంద‌రూ పోలీసు, ఆర్మీ అధికారుల‌మ‌ని చెబుతూ ప్ర‌జ‌ల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేయ‌సాగారు.

కాగా వారు ఫిబ్ర‌వరి 1వ తేదీన కేపీహెచ్‌బీ కాల‌నీలో నివాసం ఉండే సెకండ్ హ్యాండ్ కార్ల డీల‌ర్ తిమ్మిరెడ్డి దిలీప్‌ను కూడా బెదిరించి రూ.50వేలు వ‌సూలు చేశారు. అది స‌రిపోద‌ని రూ.5 ల‌క్ష‌లు కావాల‌ని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్రయించాడు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టి నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. నాగ‌రాజు, దీపక్ కుమార్‌, అనిల్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 2 స్టీల్ బేడీలు, ఒక డ‌మ్మీ పిస్ట‌ల్‌, 2 క‌త్తులు, ఎస్ఎస్ కార్తీక్ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఓ పోలీస్ యూనిఫాం, కార్తీక్ సింగ్ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఆర్మీ యూనిఫాం, ఏపీ09బీటీ7779 అనే హోండా అక్కార్డ్ కారు, 2 సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో ఇద్ద‌రు నిందితులు పైల స్వామి స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ‌నులు ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

నిందితుల‌పై గ‌తంలో ప‌లు చోట్ల కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు వివ‌రించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పూడూరు, హైద‌రాబాద్ పంజాగుట్ట‌, సైబ‌రాబాద్ ఆర్‌సీ పురం పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. ఈ మేర‌కు నిందితుల‌ను పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here