నమస్తే శేరిలింగంపల్లి: అక్రమార్కులతో కుమ్మక్కై పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శేరిలింగంపల్లి బిజెపి నాయకులు రవికుమార్యాదవ్ వెస్ట్జోన్ కమీషనర్ రవికిరణ్కు ఫిర్యాదు చేశారు. జి.హెచ్.ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి సామాన్య ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. మాదాపూర్ డివిజన్ మాతృశ్రీ నగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి కోసం చేపలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న శ్రీనివాస్ కు ముందస్తు నోటీసు లేకుండా అతని షెడ్డును తొలగించారని, విషయంపై ఆరా తీయగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా తెలిసిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చలవిడిగా డబ్బులు తీసుకొని అక్రమ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ, సామాన్య పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న జీహెచ్ఎంసీ అధికారుల పై చర్య తీసుకోవాలని కోరారు. జోనల్ కమీషనరును కలిసిన వారిలో నాయకులు ఎల్లేష్, బాల కుమార్, భరత్ , ప్రవీణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్ రవీంద్ర, వేణుగోపాల్ రెడ్డి, రంజిత్ తదితరులు ఉన్నారు.






