- ఆపరేషన్ చేసి రక్షించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి రక్షించారు. హాస్పిటల్ వైద్యులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్కు ఇటీవలే ఓ మహిళ తీవ్రమైన ఛాతి నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, జ్వరం సమస్యలతో వచ్చింది. కాగా ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఆమె శరీరంలో 20 సెంటీమీటర్ల పరిమాణంలో నీటి బుడగ (తిత్తి) ఉందని గుర్తించారు. ఈ క్రమంలో ఆమెకు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆమెను రక్షించారు.

కాగా ఆ మహిళ శరీరంలో ఉన్న నీటి బుడగ ఆమె డయాఫ్రమ్, పెద్ద పేగుకు అతుక్కుని కుడి వైపున ఉన్న మూత్ర పిండాన్ని కిందకు నెడుతుందని, ఈ క్రమంలో ఈ స్థితి లక్షల్లో ఒకరికి వస్తుందని, ఇలాంటప్పుడు సమస్య ప్రాణాంతకంగా మారేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే కొందరిలో ఈ సమస్య చివరికి క్యాన్సర్కు దారి తీసే అవకాశం కూడా ఉందని తెలిపారు. అందువల్లే ఆమెకు శస్త్ర చికిత్స చేసి తిత్తిని తొలగించామన్నారు. కాగా సదరు మహిళకు శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆమె కోలుకుందని దీంతో ఆమెను డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ వెంకట్ పవన్ కుమార్, మత్తు స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.






