శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): నలగండ్ల డివిజన్ గోపనపల్లి గ్రామంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మన సాంప్రదాయాలు, సంస్కృతిని మర్చిపోకుండా వాటి గొప్పతనాన్ని పిల్లలకు కూడా తెలియజేసేలా పండుగలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడి జీవితం సత్యం, ధర్మం, ప్రేమ, భక్తి వంటి విలువలకు ఆదర్శమని పేర్కొన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం భారతదేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శకమని అన్నారు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే గీతా సందేశాన్ని ప్రస్తావిస్తూ.. ఫలితం గురించి ఆశించకుండా నిజాయితీగా మన బాధ్యతను నిర్వర్తిస్తే ఫలితం దానంతట అదే వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితంలో శ్రీకృష్ణుడి బోధనలను గుర్తుచేసుకుంటూ నిజాయితీగా, ధర్మాన్ని పాటిస్తూ మంచి మార్గంలో నడవాలని సూచించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయన కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రమేష్, రంగస్వామి, రఘునాథ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






