శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): SSR-2026 (ప్రత్యేక సంక్షిప్త సవరణ) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) తెలిపారు. సెప్టెంబర్ 5 (శనివారం), 6 (ఆదివారం) తేదీల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు) తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, ఫారమ్-6, ఫారమ్-7, ఫారమ్-8లను అందుబాటులో ఉంచనున్నారు.

ఓటర్లు తమ పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు, అలాగే ఓటర్ల వివరాల్లో తప్పుల సవరణకు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక ప్రచార దినాల సందర్భంగా నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROs) క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.





