శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో AP 40 HU 0555 నంబర్ గల థార్ వాహనం, TG 32 4957 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న చెల్లా శ్రీనివాసులు (50) తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న శివకుమార్ స్వల్ప గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





