శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హ ఓటరుకి ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు) వెంటనే అందించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, కేవలం నిర్లక్ష్యం కారణంగా ఒక్క నిజమైన ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడంతోపాటు వాటి వినియోగంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లలో నివసించే వారు, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత ఈ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టి. రామకృష్ణ పేర్కొన్నారు. ప్రతి అర్హ ఓటరుకి ఓటు హక్కు కల్పించడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షించి ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





