శేరిలింగంపల్లి, జూన్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ కాలనీలో నెలకొన్న ఔట్లెట్ సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీలో ఔట్లెట్ సరిగా లేకపోవడం, కుచించుకుపోవడం వల్ల మురుగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని, ఔట్లెట్ను సరిచేసి డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలనీ ముంపునకు గురికాకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, వరదనీరు సాఫీగా వెళ్లేలా వ్యవస్థను మెరుగుపర్చాలని చెప్పారు. ముంపు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

డ్రైనేజీ మ్యాన్హోల్స్ మరమ్మత్తులు చేపట్టడంతోపాటు, ఎయిర్టెక్ మిషన్ ద్వారా ప్రతి మ్యాన్హోల్లోని పూడిక, చెత్తను తొలగించి నీటి ప్రవాహం సజావుగా సాగేలా చూడాలని సూచించారు. అవసరమైన చోట మ్యాన్హోల్స్కు మరమ్మత్తులు చేసి వినియోగానికి తీసుకురావాలని ఆదేశించారు. కాలనీ వాసులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజలకు ఎదురయ్యే ఏ చిన్న సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని గాంధీ హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జంగయ్య యాదవ్, రాంచందర్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





