శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సాయినగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాల్లింగ్ గౌతమ్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ మేనేజర్ గురునాథ్, ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్స్పెక్టర్లు దాస్, ప్రసాద్లతో కలిసి కాలనీలో పలు ప్రాంతాలను పరిశీలించారు. కాలనీ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న గౌతమ్ గౌడ్, ముఖ్యంగా నీటి సరఫరా లోపాలు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆయన, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న గౌతమ్ గౌడ్, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.






