శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం తప్ప, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. చిన్న చిన్న పార్టీలను కూడగట్టుకుని సమావేశాలు నిర్వహించడం తప్ప దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకత్వం కనిపించడం లేదన్నారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, యువతకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల వంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అలాగే, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో వివరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని నీరటి చంద్రమోహన్ పేర్కొన్నారు.






