శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి తహసీల్దార్గా నూతనంగా నియమితులైన అశోక్ కుమార్ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ వివేకానంద నగర్లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆరెకపూడి గాంధీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పనిచేయాలని తహసీల్దార్కు సూచించారు. ఎల్లమ్మబండలో మహిళల స్వయం ఉపాధి, సాధికారత కోసం మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని, మహిళా భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని, గతంలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలను అందజేసిన గాంధీ, స్థల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ప్రక్రియ పూర్తయిన వెంటనే మహిళా పెట్రోల్ బంక్, మహిళా భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలోనే ఎల్లమ్మబండలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, మహిళలను యజమానులుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మహిళా భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అగస్త్య పాల్గొన్నారు.





