శేరిలింగంపల్లి, జూన్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి Revanth Reddy పర్యటన సందర్భంగా ఎంసీపీఐ(యు) మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ను పోలీసులు ముందస్తు చర్యల పేరుతో అరెస్టు చేయడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎంసీపీఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ నాయకులు మైదం శెట్టి రమేష్, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, వై. రాంబాబు విడుదల చేసిన ప్రకటనలో, దశరథ్ నాయక్ను సోమవారం ఉదయం ఆయన నివాసం వద్ద మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని పటాన్చెరు పోలీస్స్టేషన్ కి తరలించారని తెలిపారు.

దశరథ్ నాయక్ మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ తదితర బస్తీల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండటంతోనే దశరథ్ నాయక్ను ముందస్తుగా అరెస్టు చేశారని ఎంసీపీఐ(యు) నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే ఇలాంటి చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన దశరథ్ నాయక్ను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఎంసీపీఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.





